పోస్ట్ చేయబడింది జనవరి 6, 2026 3:18PM

హైదరాబాద్ టోలిచౌకి ప్రధాన రహదారిపై నడిరోడ్డుపై ఒక యువకుడి మృతదేహం పడివున్నా, వాహనదారులు ఏమాత్రం చలించకపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రైవేట్ బస్సు ఢీకొని మృతి చెందిన జెప్టో డెలివరీ బాయ్ అభిషేక్ మృతదేహం రోడ్డుపై పడి ఉన్న దృశ్యాలు హృదయ విదారకంగా మార్చాయి. టోలి చౌక్ వద్ద ఉచిత డెలివరీ బాయ్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. అయితే అదే సమయానికి వెనక నుండి వస్తున్న ప్రవేట్ బస్సు అది గమనించకుండా అభిషేక్ తలపై నుండి బస్సు వెళ్ళింది.
దీంతో అభిషేక్ అక్కడికక్కడే మరణించాడు. ఆపకుండా అక్కడి నుండి వెళ్ళిపోయే ప్రయత్నం చేయగా కొంతమంది స్థానికులు బస్సును అడ్డగించి బస్సు డ్రైవర్లు పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అభిషేక్ రోడ్డు మీద పడిపోవడంతో కొందరు వాహనదారులు మృతదేహం పక్కనుంచే నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుకుంటూ వెళ్లిపో యారు. బతికున్నాడా? గాయపడ్డాడా? అన్న కనీస మానవీయ విచారణ కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. అత్యంత బాధాకరమైన విషయం ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారిలో కొందరు పోలీసులకు లేదా అంబులెన్స్కు సమాచారం ఇవ్వాలన్న కనీస బాధ్యతను నిర్వర్తించలేదు.
నడిరోడ్డుపై మృతదేహం చూస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఘటన సమాజంలో మానవత్వం ఎంతగా క్షీణించిందో చాటిచెప్పింది. రోడ్డుపై పడివున్న వ్యక్తి ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్న విషయం తెలుసుకునే నైతిక జ్ఞానం కూడా కొందరు వాహనదారుల్లో కనపడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పనుల్లో నిమగ్నమై, బాధ్యతలేమిటో అక్కడి నుంచి వెళ్లిపోవడం చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ఘటనపై సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రమాదాల సమయంలో బాధితులకు సాయం చేయడం ప్రతి పౌరుడి కర్తవ్యం అని, కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తుచేస్తున్నారు. నడిరోడ్డుపై మృతదేహం ఉన్నా స్పందించని ఈ నిర్లక్ష్యం మరోసారి సమాజానికి అద్దం పట్టినట్టయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
