భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత గొప్ప పథకాలు ప్రవేశపెట్టినా, వాటిని అమలు చేసి, ప్రతి ఇంటికి చేర్చేది గ్రామస్థాయి నాయకత్వమే. మన జీవితంలో ప్రతి రోజూ ఎదురయ్యే చిన్న చిన్న అవసరాల నుండి గ్రామాభివృద్ధి, శాంతి భద్రతల వరకు సర్పంచ్ పాత్ర ఎంతో కీలకం. అందుకే, రాబోయే ఐదేళ్ల పాటు మన జీవితాలను, మన గ్రామం భవిష్యత్తును ప్రభావితం చేయగల సరైన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవడం మన పౌర బాధ్యత. సర్పంచ్ కేవలం ఒక పదవి కాదు, అది ఒక బాధ్యత. గ్రామంలో మంచినీటి సరఫరా, అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ.. ప్రాథమిక సౌకర్యాలన్నీ సర్పంచ్ ఆధీనంలోనే ఉంటాయి. ఈ ఐదేళ్ల కాలంలో సర్పంచ్ తీసుకునే నిర్ణయాలే మన పిల్లల విద్య, మన ఆరోగ్యం, మన భూముల రక్షణ, ప్రభుత్వ పథకాల లభ్యత వంటి వాటిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఒక మంచి సర్పంచ్ అంటే గ్రామంలో ఏ లో ఉందో తెలుసుకుని, దాన్ని పూర్తి చేయడానికి కృషి చేసేవారు. ప్రభుత్వ నిధులను పారదర్శకంగా, సమర్థంగా వినియోగించేవారు. కుల, మత, రాజకీయ విభేదాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయే నాయకత్వం ఉండాలి. ఎన్నికల సమయంలో డబ్బుకో, మద్యానికో ఆశపడి ఓటు వేస్తే, ఆ తప్పు నిర్ణయం ప్రభావం ఐదేళ్ల పాటు గ్రామంపై ఉంటుంది. సరైన ప్రణాళిక లేని నాయకుడు గ్రామాన్ని అభివృద్ధి చేయలేకపోగా, ఉన్న వనరులను కూడా నాశనం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి, ప్రజలారా, మీ ఓటు విలువైనది. సర్పంచ్ను ఎన్నుకునే ముందు, ఆ అభ్యర్థికి గ్రామంపై ఎంత నిబద్ధత ఉందో, వారి గత చరిత్ర ఎలా ఉందో, ఏయే సమస్యలపై వారికి స్పష్టమైన దృష్టి ఉందో తెలుసుకోండి. ఎన్నికల రోజున, కేవలం బంధుత్వం కోసం, తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా, మీ ఇంటికి నిజంగా న్యాయం చేయగల, నిజాయతీ, దక్షత ఉన్న వ్యక్తిని ఎన్నుకోండి. మీ ఒక్క ఓటు, మీ గ్రామానికి ఐదేళ్ల పాటు స్వర్ణయుగం లాంటి అభివృద్ధిని తీసుకురావాలి. ఐదేళ్ల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. విజ్ఞతతో ఓటేయండి!
– వెంకటేశ్ గుగ్గిళ్ల
విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్కోడ్కు గుడ్బై చెప్పండి.. భారత్లో కొత్తగా డిజి పిన్
