నవంబర్ 18, 2025 3:04PMన పోస్ట్ చేయబడింది
.webp)
తెలంగాణ స్థానిక ఎన్నికలు ఎప్పడు అన్నదానిపై సస్పెన్స్ తొలగిపోయింది. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇదే జోరులో, ఇదే జోష్ లో ఉండగానే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కూడా వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 1 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ప్రజాపాలన ఉత్సవాల తరువాత స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసింది 20 నెలలకు పైగా అయ్యింది. ఈ నేపథ్యంలో వాటి నిర్వహణపై గత ఏడాదిగా సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకోవడంతో ఆ సస్పెన్స్ తొలగినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఎన్నికలు, ఆ తరువాత స్వల్ప విరామం అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అధికార పార్టీ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని సంకల్పించింది. ఆ కారణంగానే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జాప్యం అయ్యాయని చెప్పక తప్పదు. స్థానిక ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం బీజేపీ వ్యతిరేకించడంతో అది సాధ్యం కాలేదు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును, అటు పిమ్మట సుప్రీం కోర్టునూ ఆశ్రయించింది. అయితే.. రెండు చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూల స్పందన రాలేదు. రిజర్వేషన్లలో 50 శాతం పరిమితికి కట్టుబడి ఉండాలని సూచించింది, సుప్రీం కోర్టు ఈ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు సంబంధించి ఈ నెల 24న సమీక్షించనుంది. ఈ రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో హైకోర్టు ఏం చెబుతుందన్నదానిపై ఉత్కంఠ ఉంది. మొత్తం మీద కోర్టు తీర్పు ఎలా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎన్నికలకు అనుకూలంగా మారకుండా స్థానిక ఎన్నికలను పూర్తి చేయాలని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
