
బాహుబలి సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో, అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలుసా. ఈ సినిమా రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే పార్టు కింద ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దాని రన్ టైం కూడా ఎంతనో చెప్పేశారు. అయితే ఇలా రెండు పార్టులను ఒకే సినిమాగా విడుదల చేయడం బాహుబలి టీం కి ఆలోచన ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ.. ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ పారిశ్రామికవేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు ఈ ఐడియా ఇవ్వడం విశేషం. (బాహుబలి: ది ఎపిక్)
అసలు విషయం ఏంటంటే… బాహుబలి-2 (ఏప్రిల్ 28, 2017) విడుదలైన వారానికి లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ.. మే 6, 2017న ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే… “రాజమౌళి గారు… బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేయండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. ఈ అద్భుతంతో మళ్లీ తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్లు రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు” అని ట్వీట్ చేశారు.
ఎనిమిదేళ్ల క్రితమే బాహుబలిని ఒకే సినిమాగా విడుదల చేయడానికి ఐడియా ఇచ్చిన విక్రమ్ నారాయణరావుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

